ఎమ్మేల్యే బాలకృష్ణకు వినతిని అందిస్తున్న సిఐటియు, పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు
ప్రజాశక్తి-హిందూపురం
హిందూపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, సిఐటియు పట్టణ కన్వీనర్ విఆర్.రాములు కార్మిక సమస్యలపై ఎమ్మెల్యేతో మాట్లాడారు. హిందూపురం మున్సిపాలిటీ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులు 220 మంది గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఆప్కాస్ విధానం తీసుకొచ్చిందని, దీనివల్ల 60 సంవత్సరాల తర్వాత కార్మికులను తొలగిస్తున్నారని చెప్పారు. అనారోగ్య సమస్యలతో కార్మికులు చనిపోగా ఆయా కుటుంబస్తులకు ఉద్యోగం ఇవ్వడం లేదన్నారు. 60 సంవత్సరాల పేరుతో 17 మంది కార్మికులను తొలగించారని తెలిపారు. వీరందరికీ ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ప్రభుత్వం నుంచి ఇవ్వలేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్తో పాటు కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వాల్సుందన్నారు. వీటిపై స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి జగదీష్, అధ్యక్షులు మల్లికార్జున, కోశాధికారి ఆనంద్, సహాయ కార్యదర్శి చంద్ర, నాయకులు రామచంద్ర, రామంజప్ప, శంకర కుమార్, అంజి, ప్రసాద్, నారాయణ, బాబయ్య, శివ, చంద్రశేఖర్, మహిళా నాయకులు కవితమ్మ, గంగ రత్నమ్మ, మహేశ్వరమ్మ, లక్ష్మమ్మ, అశ్వర్థమ్మ పాల్గొన్నారు.