మహిళల సమగ్ర వికాసానికి ప్రత్యేక యాప్‌ : ఛైర్మన్‌

శిక్షణలో మాట్లాడుతున్న మున్సిపల్‌ ఛైర్మెన్‌ రమేష్‌ కుమార్‌

ప్రజాశక్తి-హిందూపురం

మహిళల సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం మహిళాకాశం పేరిట ప్రత్యేక యాప్‌ రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చిందని మున్సిపల్‌ ఛైర్మన్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విశ్వ జ్యోతి ఆధ్వర్యంలో మహిళాకాశం యాప్‌పై మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక లావాదేవీల నిర్వహణతో పాటు కుటుంబాల వివరాలను ఈ యాప్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. యాప్‌ మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కు అనుసంధానం చేయడం వల్ల నేరుగా రుణాలను పొందే అవకాశం ఉందన్నారు. రూ 5 లక్షల లోపు రుణం పొందాలంటే పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న మిషన్‌ కోఆర్డినేటర్‌ ద్వారా మంజూరు చేస్తారని, రూ.20 లక్షల వరకు మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లాగిన్‌లోనే రుణ అనుమతులు ఇస్తారన్నారు. శిక్షణ తీసుకున్న ఆర్‌పిలు మహిళా సంఘాల వారికి సమగ్రంగా వివరించి యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జీవనోపాదుల అధికారి వాసుదేవ రెడ్డి, జిల్లా ఐబి భవాని, డిఎంసి గంగులయ్య, టిఎల్‌ఎఫ్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి, టిఎంసి రమాదేవి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

➡️