సత్య సాయి శతజయంతి ఉత్సవాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి

May 9,2025 21:28

ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లె సింధూర

                      పుట్టపర్తి క్రైమ్‌ : సత్య సాయి బాబా 100వ జయంతోత్సవాల సందర్భంగా అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా విన్నవించారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు పుట్టపర్తి విమానాశ్రయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈసందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సిఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. సత్యసాయి 100వ జయంతోత్సవాల సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సుమారు రూ. 120 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా 2018లో టిడిపి ప్రభుత్వ హాయంలో కొత్త చెరువు మండల కేంద్రంలో రూ 2 కోట్లతో మంజూరైన ఇండోర్‌ స్టేడియం అర్ధాంతరంగా ఆగిపోయిందని వాటికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గం లోని ఎస్టీ కాలనీల్లోని 81 పనులకు సుమారు రూ.5.50కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. అంతే కాకుండా నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలో 135 సిసి రోడ్ల నిర్మాణానికి రూ.8.10 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.

పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ బేకరీ గంగాధర్‌ మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో కూడా ఎస్సీ కార్పొరేషన్‌కు 344 కోట్ల రూపాయలు బడ్జెట్‌ నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక నిధుల కేటాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు.

➡️