మడకశిరలో నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి డప్పు వాయిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే,
మడకశిర డిపోను మోడల్గా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ప్రజాశక్తి-మడకశిర
అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశంత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రోడ్డు, రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్.రాజుతో కలిసి పాల్గొన్నారు. మడకశిరలోని క్రీడా సముదాయాన్ని పరిశీలించారు. మడకశిర డిపో నుంచి కదిరి -అనంతపురం వయా ముదిగుబ్బ, బత్తలపల్లి, కదిరి- రాయచోటి వయ గాండ్లపెంట, ఎన్పి.కుంట బస్సు సర్వీసులను ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బిఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ నూతన విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి నీరుగారిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్ది ప్రభుత్వ శాఖలను గాడిలో పెడుతోందన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. మడకశిర డిపో అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయక సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే ఎంఎస్.రాజు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గంలో రూ.15వేల కోట్లతో అతి పెద్ద సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పిపిటిఒ మధుసూదన్, మడకశిర డిపో మేనేజర్ శ్రీకాంత్, డిపో మేనేజర్ సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.