దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

May 8,2025 22:04

పుట్టపర్తిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయకులు

                 పుట్టపర్తి రూరల్‌ : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈనెల 20న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కార్మిక సంఘాలు, సిఐటియు జిల్లా నాయకులు కోరారు. ఈమేరకు స్థానిక సిఐటియు కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్‌ వెంకటేష్‌, ఎఐయుటియుసి జిల్లా కార్యదర్శి అశోక్‌ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మతోన్మాద మోడీ ప్రభుత్వం కాలరాసేందుకు పూనుకుందన్నారు. భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్‌ కోడ్స్‌ తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్‌ కోడ్ల వల్ల కార్పొరేట్లకు లాభాలు పెరిగి, కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రానికి ముందుగాని, తర్వాత గాని వచ్చిన కార్మిక చట్టాలు ఏవీ కూడా ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాదిమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. 3 నల్ల చట్టాలతో రైతులను, 4 లేబర్‌ కోడ్లలో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షోభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోడీ మతోన్మాద ఎజెండాను ఎంచుకుందన్నారు. కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు సమ్మెల ద్వారా కట్టడి చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ పాల్గొంటున్నాయని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్‌ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లాకోశాధికారి సాంబశివ, సీనియర్‌ నాయకులు రామకృష్ణ, ఎఐయుటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్‌, సిఐటియు నాయకులు గంగాధర్‌, కొత్తచెరువు మండల కన్వీనర్‌ ముత్యాలప్ప, బుక్కపట్నం మండల కన్వీనర్‌ అంజితో పాటు వివిధ రంగాల కార్మికులు సరస్వతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

హిందూపురం : దేశ వ్యాప్తంగా కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు వేమయ్య కోరారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం పుట్టపర్తి సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ, మే 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో కార్మిక లోకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చౌళూరు రవికుమార్‌, మారుతి రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

➡️