వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు
పెనుకొండ : విద్యుత్ వినియోగదారులపై మోపిన ట్రూ ఆప్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం పెనుకొండ ట్రాన్స్కో ఏడీకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,441 కోట్ల అదనపు విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందన్నారు. మూడవ దఫా ట్రూ అప్ చార్జీలను వినియోగదారులపై మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని వాగ్దానం చేసిన కూటమి ఇప్పుడు మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. వెంటనే విద్యుత్ అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. అదానితో ఒప్పందం రద్దుచేసి తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాలని స్మార్ట్ మీటర్ల బిగింపు చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరి, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటియు మండల కన్వీనర్ బాబావలి, కాంగ్రెస్ పార్టీ నిసార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, సిఐటియు నాయకులు మహబూబ్, బాషా, షేక్షావలి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.