ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్
ప్రజాశక్తి-అనంతపురం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లను త్వరితగతిన, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం వద్దనున్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. అనవసర బ్యారికెడ్లను ఏర్పాటు చేయొద్దన్నారు. సభా ప్రాంగణంలో ఆ గ్రామానికి చెందినవారే ఉండే విధంగా చూడాలన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గ నుంచి 10 మంది ఆయకట్టు రైతులు మొత్తంగా 3వేల వచ్చేవిధంగా చూడాలని పీడీ డీఆర్డీఏ అధికారులకు సూచించారు. హెలిప్యాడ్, కాన్వారు, సభా ప్రాంగణం, తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. అవసరం ఉన్నచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఉరవకొండ : ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం వద్ద హెలిప్యాడ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ, గ్రామసభ వద్ద ఏర్పాట్లను ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. హెలిప్యాడ్ వద్ద త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అనంతపురం ఆర్డీవో, ఆర్అండ్బి ఎస్ఈలను ఆదేశించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ బ్రిడ్జి వద్ద అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈకి సూచించారు. గ్రామసభ ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకోవాలని గుంతకల్ ఆర్డీవోని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు కేశవ నాయుడు, శ్రీనివాస్, డిపిఒ నాగరాజు నాయుడు, జిల్లా పరిషత్ సీఈవో రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్అండ్బి ఎస్ఈ రాజగోపాల్, డిఎల్డివోలు లలితాబాయి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.