నాగేంద్ర బాబు కుటుంబ సభ్యులకు చెక్కును అందిస్తున్న యుటిఎఫ్, ప్రజాసంఘాల నాయకులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
ఉపాధ్యాయుడిగా ఉంటూ సామాజిక స్పృహతో సమాజ మార్పునకు కృషి చేసిన సమాజహితుడు, ఆదర్శనీయమైన గొప్ప నాయకుడు సికె.నాగేంద్రబాబు అని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్ తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అనంతపురం జిల్లా పూర్వపు ప్రధాన కార్యదర్శి సికె.నాగేంద్ర బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సంతాప సభను యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు, సిఐటియు, ఐద్వా, ప్రజా సంఘాల నేతలు హాజరై నాగేంద్ర బాబు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ నాగేంద్ర బాబు సామాజిక స్పహ కలిగిన గొప్ప నాయుడు అన్నారు. ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహిస్తూనే సమాజహితం కోసం పని చేశారన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో యుటిఎఫ్ అనేక ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు సంఘానికి అండగా నిలబడి సంఘాన్ని బలోపేతం చేయడంలో నాగేంద్రబాబు కృషి మరువలేనిదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన మతి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.గేయానంద్ మాట్లాడుతూ నాగేంద్రబాబు సాక్షరతా ఉద్యమంలో గొప్పగా పని చేశారని గుర్తు చేశారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప మాట్లాడుతూ యుటిఎఫ్ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను తయారు చేయడంలోనూ ఆయన పాత్ర అమోఘమన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా మాట్లాడుతూ నాగేంద్రబాబు ఉపాధ్యాయుల ఉద్యమం కోసం నిస్వార్ధంగా సేవ చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ నాగేంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తూనే, ఉపాధ్యాయుల శ్రేయస్సే ధ్యేయంగా యుటిఎఫ్ పని చేస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర కుటుంబ సంక్షేమ పథకం నుంచి నాగేంద్రబాబు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్కును యుటిఎఫ్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్య సాయి జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యదర్శి అనిల్, యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, సహాధ్యక్షురాలు సరళ, కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, జిల్లా కార్యదర్శి ప్రమీల, అర్జున్, అబ్దుల్ వహాబ్, శేఖర్, సుబ్బరాయుడు, ఆడిట్ కమిటీ కన్వీనర్ చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిలర్లు ఈశ్వరయ్య, సీనియర్ నాయకులు నాగేంద్ర, మహమ్మద్ జిలాన్, కోటేశ్వరప్ప, జిల్లా పూర్వపు అధ్యక్షులు ఇమామ్ సాబ్, ఐద్వా నాయకురాలు వి.సావిత్రి, డివైఎఫ్ఐ నాయకులు బాలకష్ణ, రమణారెడ్డి, జెవివి రామిరెడ్డి, తిరుపాల్, భాస్కర్, సిఐటియు నాయకులు వి.రామిరెడి,్డ నాగేంద్ర, బాల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.