ఎంపిడిఒను ప్రశ్నిస్తున్న సీనియర్ అసిస్టెంట్
ప్రజాశక్తి – గాండ్లపెంట స్థానిక మండల మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల మధ్య రగడ రచ్చకెక్కింది. మంగళవారం ఎంపీడీవో వెంకటరమణారెడ్డి సీనియర్ అసిస్టెంట్ ఆమీర్బాషా మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. యుటలైజేషన్ ఫైల్ విషయంలో ఒకరినొకరు దూషించుకున్నారు. ఈసందర్బంలో టైపిస్ట్ మహబూబ్బాషా, సీనియర్ అసిస్టెంట్ అమీర్బాషా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టైపిస్టు తీవ్ర ఆగ్రహంతో సీనియర్ అసిస్టెంట్ పైకి కుర్చీ ఎత్తాడు. ఆసమయంలో స్పందించిన కార్యాలయ సిబ్బంది వారికి పక్కకు తోసి వేశారు. ఈ మధ్య కాలంలో ఎంపిడిఒ కార్యాలయంలో ప్రతిదీ వివాదంగానే మారింది. ఎంపీడీవో వచ్చినప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈసందర్బంగా సీనియర్ అసిస్టెంట్ అమీర్బాషా స్థానిక విలేకరులతో తనకు జరిగిన అవమానాన్ని వివరించారు. ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని అమీర్బాషా కోరారు. ఈ విషయంపై స్థానిక విలేకరులు ఎంపిడిఒను వివరణకోరగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దురుసుగా తన చాంబర్లోకి వెళ్లిపోయారు.