పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగిన్
ప్రజాశక్తి-గుంతకల్లు
గుంతకల్లు ప్రధాన రైల్వే జంక్షన్ సమీపంలోని దక్షిణ క్యాబీను వద్ద గుత్తి వైపు ఖాళీ(ర్యాకులు) వ్యాగిన్లతో వెళ్తున్న గూడ్స్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. దోర్నగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుంచి ఖాళీ (ర్యాకులు) వ్యాగిన్లతో గుత్తి వైపు వెళుతున్న గూడ్స్ రైలు గుంతకల్లు రైల్వే ప్రధాన జంక్షన్ వద్ద ఉన్న దక్షిణ క్యాబీను వద్దకు రాగానే ఇంజన్ నుంచి 12,13 వ్యాగీన్ల కప్లింగ్లు ఊడిపోవడంతో పట్టాలు తప్పింది. అప్రమత్తమైన లోకోపైలైట్ రైలును ఆపేశాడు. ఇదే సమయంలో మార్గం గుండా వెళ్లే రైళ్ల రాకపోకలనుత ఆత్కాలికంగా రైల్వే అధికారులు నిలుపుదల చేశారు. ప్రమాద సమయంలో బెంగళూరు నుంచి గుంతకల్లు వస్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలును నక్కనదొడ్డి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఎడిఆర్ఎం సుధాకర్ అధికారులను అప్రమత్తం చేసి ఇంజినీరింగ్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగీన్లను తొలగించి రైలు పట్టాల మరమ్మతులు చేపట్టారు. ప్రమాద ఘటనపై తదుపరి విచారణ చేపడతామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ అనంతరం ఆ మార్గంలో వెళ్లే రైళ్లను యథావిధిగా నడిపారు.