టోల్గేట్ వద్ద లారీలు అడ్డుపెట్టి నిరసన తెలుపుతున్న గ్రామస్తులు
ప్రజాశక్తి-లేపాక్షి
లేపాక్షి మండల పరిధిలోని చోళసముద్రం వద్ద టోల్ వసూళ్లపై పరిసర గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్గేట్ సమీపంలోని గ్రామస్తులతో డబ్బులు తీసుకోరాదని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం టోల్ ప్లాజా వద్ద లారీలను అడ్డుగా నిలిపి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్థానికులు లారీలకు సరుకు వేసుకుని వెళ్తే రూ.100, ఖాళీగా వెళ్తే రూ.50 వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ భారం నుంచి స్థానికులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై టోల్గేట్ గుత్తేదారుడు చర్చలు జరిపాడు. స్థానికులకు టోల్ వసూలు నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ జయప్ప, మాజీ కో ఆప్షన్ సభ్యుడు షెక్షావలి, లారీ యాజమానులు పాల్గొన్నారు.