ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలి

ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించాలని

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించకుండా కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్‌బిఐ వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన నగరంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన బ్యాంచ్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత నాలుగేళ్లలో అమ్మిన బాండ్లు, వాటిని కొన్న వారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి ఈ నెల 6న బ్యాంకు అందించాలని, ఇసి ఆ వివరాలను ఈ నెల 13లోగా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైందన్నారు. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్‌బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసిందన్నారు. ఆ వివరాలను వెల్లడించడానికి బదులు ఎస్‌బిఐ గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. అంటే ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా ఉండేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోందని విమర్శించారు. తన కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్‌ చేసిన ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్దిరోజుల్లో పొందుపరిచి ఇవ్వలేకపోవడం నమ్మశక్యం కాదన్నారు. మోడీ ప్రభుత్వం ఒత్తిళ్ల కారణంగానే ఎస్‌బిఐ ఈ వైఖరి తీసుకుందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎస్‌ఐబి అందచేసేలా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యులు జి.సింహాచలం, సిహెచ్‌.అమ్మన్నాయుడు, జి.ఈశ్వరమ్మ, గోవర్థనరావు, సుధాకర్‌ పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌ : ఎన్నికల బాండ్లు వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేయాలని సిపిఎం నాయకులు నంభూరు షణ్ముఖరావు డిమాండ్‌ చేశారు. టెక్కలిలోని పాత బస్టాండ్‌ వద్ద ఉన్న స్టేట్‌ బ్యాంకు వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొల్లి ఎల్లయ్య, హెచ్‌.ఈశ్వరరావు, వాకాడ ధనుంజయరావు, యర్ర ఉదరు, పాలిన సాంబయ్య, పోలయ్య, గౌరమ్మ పాల్గొన్నారు. ఆమదాలవలస : ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టాల్సిందేనని సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశాయి. పట్టణం లోని ఎస్‌బిఐ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్ర మంలో బొడ్డేపల్లి మోహనరావు, బొడ్డేపల్లి జనార్థర రావు, జి.ధనుంజయరావు, బుడుమూరు మోహన రావు, పి.రామారావు, కె.సంతోష్‌కుమార్‌, సిహెచ్‌. రమణ, మురళీధర్‌, ఎ.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.మందస : మందస స్టేట్‌ బ్యాంకు వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు నాయకులు పి.దేవేంద్ర, చిరంజీవి, వెంకటేష్‌, జయరాం పాల్గొన్నారు.

 

➡️