స్పీకర్కు సమస్యను చెప్తున్న వసంతరావు
ప్రజాశక్తి- సరుబుజ్జిలి
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రజలు కోరారు. శుక్రవారం మండలంలో మూల సవవాళాపురం గ్రామ పంచాయతీలో స్పీకర్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సిరిపల్లి వసంతరావు అనే యువకుడు తనకు 1.47 సెంట్లు భూమి ఉండగా భూ సర్వేలో 2.52 సెంట్లు భూమి ఉన్నట్లు నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారని చెప్పారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లను మంజూరు చేయాలని, అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని స్పీకర్కు సమస్యను వివరించారు. తురకపేట కాలనీలో రహదారులు, డ్రైనేజీలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని యువకులు కోరాడ నరేష్, నారాయణరావు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా మూలస వలాపురం, తురక పేట కాలనీ, వ్యాసులపేట గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింట మంచినీటి కొళాయిలను స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు కెవిజి సత్యనారాయణ, వైస్ ఎంపిపి జివి.శివానందమూర్తి, వైసిపి నాయకులు బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.