తాబేళ్లను దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శంకర్
ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి – గార
ప్రసిద్ధ శ్రీకూర్మం క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మృతి, దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శ్రీకూర్మం ఆలయ ఇఒ కార్యాలయం వెనుక నక్షత్ర తాబేళ్లను దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయన్న దానిపై ఆరా తీశారు. తాబేళ్ల సంరక్షణ చేపడుతున్న గ్రీన్మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం 212 తాబేళ్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దహనం చేసిన తాబేళ్ల అవశేషాలను సేకరించి పశుసంవర్థక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారని చెప్పారు. ఉన్న వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అన్న దానిపై అధికారులు పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియని ఆలయ అధికారులు, సిబ్బంది చెప్తున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఆలయ అధికారులు, టిడిపి నాయకులు ఉన్నారు.