మాట్లాడుతున్న ఎస్పి మహేశ్వర రెడ్డి
- ఎస్పి కె.వి మహేశ్వర రెడ్డి
ప్రజాశక్తి – శ్రీకాకుళం
సమగ్ర దర్యాప్తుతో ప్రాపర్టీ కేసులను త్వరితగతిన ఛేధించి, రికవరీ చేయాలని ఎస్పి కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పిలు, సిఐలు, ఎస్ఐలతో లోక్ అదాలత్ కేసులు, ఎస్సి, ఎస్టి, పోక్సో కేసులు, క్రైమ్ అగైనస్ట్ ఉమెన్, ప్రాపర్టీ, ఎన్ఫోర్స్మెంట్ కేసులపై వర్చువల్ విధానంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న నిర్వహించే లోక్ అదాలత్లో రాజీ పడేందుకు అవకాశమున్న ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా ఇప్పట్నుంచే ప్రణాళికతో పనిచేయాలన్నారు. క్రైమ్ అగైనస్ట్ ఉమెన్, పోక్సో, ఎస్సి, ఎస్టి, ప్రాపర్టీ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో సమగ్ర దర్యాప్తుతో పురోగతి సాధించాలని సూచించారు. ప్రతి పోలీస్స్టేషన్లో లాస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సి, ఎస్టి, పోక్సో కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ కేసులను పెంచాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, జూదమాడినా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించి, అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పి కె.వి రమణ, డిఎస్పిలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.