పరిశీలిస్తున్న నోడల్ అధికారి విశ్వేశ్వరరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఇవిఎంల భద్రతా ఏర్పాట్లపై మాసాంతపు తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్లోని ఇవిఎం గోదామును రాష్ట్ర ఇవిఎం నోడల్ అధికారి కె.విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. గోదాములో అమల్లో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, నిరంతర సిసి టివి పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థలను, సిబ్బంది విధులు, హాజరును సమీక్షించారు. ఇవిఎంల భద్రత, రికార్డు నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో వివిధ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కలిగేందుకు ఇటువంటి తనిఖీలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. తనిఖీ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎన్నికల విభాగపు అధికారులు, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సిబ్బంది పాల్గొన్నారు.అరసవల్లి సందర్శన జిల్లా పర్యటనకు వచ్చిన ఇవిఎం నోడల్ అధికారి విశ్వేశ్వరరావు కుటుంబసభ్యులతో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అనంతరం స్వామివారి సేవల్లో పాల్గొన్న ఆయనకు అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ సహాయకులు శోభనాద్రిచార్యులు పాల్గొన్నారు.