శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌లో సివిల్‌ మాక్‌ డ్రిల్‌

భారత్‌-పాక్‌ మధ్య

‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ విజయవంతం

ప్రజాశక్తి – ఆమదాలవలస

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన సివిల్‌ మాక్‌ డ్రిల్‌ విజయవంతంగా ముగిసింది. ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌లో బుధవారం చేపట్టిన మాక్‌ డ్రిల్‌లో పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సైరన్‌ మోత మోగించి అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో సమీపాన పౌరులు స్వీయ రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, రక్షణ దళాలు ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై మాక్‌ డ్రిల్‌ సాగింది. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖ, రైల్వే, జిఆర్‌పి, ఐసిడిఎస్‌, ఇతర శాఖల సమన్వయంతో ఈ సివిల్‌ మాక్‌ డ్రిల్‌ను నిర్వహించి ప్రయాణికులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వేస్టేషన్‌, ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు చేస్తే అత్యవసర, ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పౌరులు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై స్పెషల్‌ పార్టీ పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫైర్‌, హెల్త్‌ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలను మాక్‌ డ్రిల్‌ ద్వారా చూపించారు. ప్రమాదం సంభవించిన వెంటనే క్షతగాత్రులను ఆంబులెన్స్‌ ద్వారా హాస్పిటల్‌కు ఎలా తరలించాలి, బాంబులు అమర్చిన ప్రాంతాన్ని బాంబు స్క్వాడ్‌ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్‌ చేయాలి, ఉగ్రవాదులు, శత్రుమూకలను ఏవిధంగా హతమార్చాలని అంశాలను సివిల్‌ మాక్‌ డ్రిల్‌ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సాయి ప్రత్యూష, డిఎస్‌పిలు వివేకానంద, శేషాద్రి, జిల్లా అగ్నిమాపక అధికారి జె.విజయకుమార్‌, ఎస్‌బి సిఐ ఇమ్మాన్యుల్‌ రాజు, ఆమదాలవలస సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️