మాట్లాడుతున్న అంబేద్కర్ యూనివర్శిటీ విసి రజని
ప్రజాశక్తి – ఎచ్చెర్ల
సమానత్వంతోనే సాధికారిత సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కె.ఆర్ రజని అన్నారు. జాతీయ సామాజిక విజ్ఞాన పరిశోధన మండలి-దక్షిణ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం, వర్శిటీ అంబేద్కర్ అధ్యయన కేంద్రం సంయుక్తంగా ‘విస్మరించబడిన వర్గాలకు సాధికారిత – సామాజిక పని విలువలకు డా.అంబేద్కర్ సహకారం’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా సమాజ వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకోవడమే కాకుండా వాటి పరిష్కారంలో భాగస్వాములు కావచ్చన్నారు. వర్శిటీ రిజిస్ట్రార్ పి.సుజాత మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనల కోసం పాటుపడితే ప్రతిఒక్కరికీ విద్య, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సాధికారిత సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కుల ఫోరం ప్రధాన కార్యదర్శి వి.ఎస్ కృష్ణ, సోషల్ వర్క్ విభాగపు బిఒఎస్ చైర్మన్ ఆచార్య పి.అర్జున్, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు, సెమినార్ కన్వీనర్ యు.కావ్యజ్యోత్స్న, కో-కన్వీనర్లు డి.వనజ, కె.శ్యామల, స్కాలర్ జి.నవీన తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ దృక్పథంలో విభిన్న అంశాలు, అధ్యయనాలపై సెమినార్లో పరిశోధనా ప్రసంగాలు చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ముగింపు రోజు అంబేద్కర్ తాత్విక దక్కణం- సామాజిక న్యాయం, ఆధునిక సోషల్ వర్క్ రంగంలో అంబేద్కర్ సంబంధిత ఆలోచనలు, సుస్థిరతమైన సాధికారిత- అంబేద్కర్ సిద్ధాంతాలు మరియు సోషల్ వర్క్ విలువలు, సమ్మిళిత మరియు విభిన్న నివాసితులు, అంబేద్కర్ తాత్వికత ద్వారా సమాజాభివృద్ధి అనే అంశాలపై మూడు టెక్నికల్ సెషన్స్ నిర్వహించారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (విజయనగరం) సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు ఎం.నగేష్, తిలక్, మహారాష్ట్ర విద్యాపీఠ్(పూణే) సోషల్ వర్క్ విభాగాధిపతి ప్రకాష్, ఎస్.యాదవ్, భారతి విద్యాపీఠ్ యూనివర్శిటీ (సోలాపూర్) సామాజిక విజ్ఞాన కేంద్రం సంచాలకులు కీర్తిరాజ్ తదితరులు మాట్లాడారు.