అంజలి ఘటిస్తున్న ఆంజనేయులు
ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
గరిమెళ్ల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఎజె జాతీయ నాయకులు జి.ఆంజనేయులు పేర్కొన్నారు. నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మతి వనంలో స్వాతంత్ర సమరయోధులు, ప్రజా కవి గరిమెళ్ల సత్యనారాయణ జయంతి వేడుకలు కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గరిమెళ్ల విహ్రానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో గరిమెళ్ల రచనలు, పాటలు, అక్షర రూపంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. స్వాతంత్ర సమరంలో గరిమెళ్ల, అనంతరం జర్నలిస్టు ఉద్యమంలో మానుకొండ చలపతిరావు కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఇటువంటి స్పూర్తినిచ్చే వారికి శ్రీకాకుళం జిల్లా జన్మనిచ్చిందన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం మాజీ పాలకమండలి సభ్యులు డాక్టర్ జామి భీమశంకర్, ఇంటక్ ప్రతినిధి వావిలపల్లి జగన్నాథ నాయుడు, ట్రస్ట్ ప్రతినిధి కొంక్యాన వేణుగోపాల్, ఎపిడబ్ల్యుజె విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు పండితులు అవధాని పైడి హరనాధ్ గరిమెళ్లపై పలు గీతాలను ఆలపించారు. కొంక్యాన ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు ఎంవిఎస్ఎస్ శాస్త్రి, నక్క శంకరరావు, తర్లాడ అప్పలనాయుడు, ఎపిడబ్ల్యూజెఎఫ్ విశాఖ జిల్లా ప్రతినిధులు జి. శ్రీనివాస్, డి.రవికుమార్, కొండబాబు, కొంక్యాన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.