శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి – టెక్కలి రూరల్
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. లింగాలవలస, టెక్కలి ప్రాంతాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లింగాలవలసలో రూ.2.30 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అదే గ్రామంలో రూ.18.60 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ గోడ, రూ.6 లక్షలతో చేపట్టిన సిసి రహదారిని ప్రారంభించారు. టెక్కలి పట్టణంలో రూ.61 లక్షల అంచనా వ్యయంతో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోనే మోడల్ అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం లింగాలవలసలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్డిఒ ఎం.కృష్ణమూర్తి, కోటబొమ్మాళి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, ఎల్.ఎల్ నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు పినకాన అజరు కుమార్, బగాది శేషగిరిరావు, కోల లవకుమార్, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.