మాట్లాడుతున్న ఆర్డిఒ సాయిప్రత్యూష
ప్రజాశక్తి – శ్రీకాకుళం
శ్రీకాకుళం నియోజకవర్గం పరిదిలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మార్పులు, చేర్పులపై సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆర్డిఒ కె.సాయి ప్రత్యూష కోరారు. స్థానిక ఆర్డిఒ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో మరణించిన ఓటర్లు, వివాహమైన తర్వాత కొత్తగా వచ్చిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాల మార్పులు, చేర్పుల జాబితాలో ఉన్నాయన్నారు. వాటిని వార్డులు, గ్రామాల వారీగా గుర్తించి తొలగింపునకు చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఎపిక్ కార్డుల ఆధారంగా 171 ఓట్లు రెండు చోట్ల నమోదై ఉన్నట్లు గుర్తించామని వాటిని తొలగించాలని సూచించారు. సమావేశంలో తహశీల్దార్లు ఎస్.గణపతిరావు, పద్మావతి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ జి.కె శ్రీనివాసరావు, మాదారపు వెంకటేష్ (టిడిపి), ఎ.శ్రీనివాసరావు (వైసిపి) కుమారి (కాంగ్రెస్), ఆర్.పురుషోత్తం (బిజెపి) తదితరులు పాల్గొన్నారు.