పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు

పాడి పరిశ్రమా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

పాడి పరిశ్రమా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రేగులపాడులో రూ.2.30 లక్షలతో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో నిర్మించిన మినీ గోకులం (గోశాల)ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని రోడ్లు, ఉద్యాన పంటల పెంపకం, రైతులకు నేరుగా చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించలేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. చాలాచోట్ల ధ్వంసమైన రోడ్లను నిర్మిస్తున్నామని అన్నారు. ఉద్యాన పంటలు అధిక దిగుబడులు ఇస్తాయని, రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పారు. లింగాలపాడుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేసి పంటలకు నీరు అందించేందుకు కృషి చేశామన్నారు. దేశంలోనే మరెక్కడలేని విధంగా రూ. 4 వేలు పింఛను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వణణ బాధ్యత లు ప్రయివేటు యాజమాన్యాలకు అప్పగిస్తున్నామని, తద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుందని అన్నారు. కార్యక్రమం లో ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి, అడిషనల్‌ ఎస్‌పి రామారావు, పిఎసిఎస్‌ మాజీ సభ్యులు కింజరాపు హరివరప్రసాద్‌, పశుసంవర్థక సంయుక్త సంచాలకులు మురళీధర్‌, రేగులపాడు సర్పంచ్‌ ప్రభాకర్‌, ఎంపిడిఒ ఫణీంద్రరావు, ఎపిఒ హరిప్రసాద్‌, మాజీ ఎంపిపిలు తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి పాల్గొన్నారు.

 

➡️