సమస్యల పరిష్కారానికి నిరీక్షణ
అవసరం లేకుండా చర్యలు
అందుబాటులోకి 150 రకాల ప్రభుత్వ సేవలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్న వారి కోసం పురపాలక సేవలు నేరుగా పొందడానికి ప్రభుత్వం పురమిత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కారానికి రోజుల సమయం నిరీక్షణ, అధికారులకు ఫిర్యాదు చేయాలన్నా కార్యాలయానికి వెళ్తే అందుబాటులో ఉండక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఫిర్యాదు కోసమే రోజులు, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నుంచి బయటపడేందుకు పురపాలక శాఖ కొత్తగా పుర మిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ చేతిలో ఉంటే తక్షణమే ఎలాంటి ఫిర్యాదునైనా యాప్ ద్వారా పంపించుకోవచ్చు. 150 రకాల సేవలను పుర మిత్ర యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్లో పలురకాల సేవలను శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో పొందడానికి వీలుంది. యాప్ ద్వా రా 150 రకాల సేవలుసమస్యకు సంబంధించిన ఫొటో తీసి ఫోన్లో వాయిస్ రికార్డులో సమస్యను వివరిస్తే, ఆ సమస్య సమాచారం సంబంధిత విభాగ అధికారికి చేరుతుంది. కనీసం మూడు రోజుల నుంచి 15, లేదా 30 రోజుల గడువు లోగా సమస్యను పరిష్కరిస్తారు. యాప్ను ప్లేస్టోర్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీన్ని నేరుగా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావచ్చు. పురపాలక రెవెన్యూ, పట్టణ ప్రణాళికా విభాగం, ఇంజినీరింగ్, అకౌంట్స్, పరిపాలన విభాగాలకు సంబంధించి 150 రకాల పౌర సేవలను పొందుపరిచారు. ఇతర ప్రాంతాల్లో సమస్యనైనా అధికారుల దృష్టికి తీసుకురావడానికి వెసులుబాటు కల్పించారు. ప్రజలు సమస్యను అధికారులకు తెలిపేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పారిశుధ్యం, నీటి సరఫరా, వీధిదీపాలు వంటి సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. జనన, మరణ ధ్రువపత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, పన్ను చెల్లింపులు, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ వంటివి ఇందులో పొందడానికి వీలు కల్పించారు. అలాగే బిల్లుల చెల్లింపునకు ఇందులో అవకాశం కల్పించారు. సమస్య పరిష్కారంపై ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కూడా ఈ యాప్లో ఉంది. ప్రజలు పంపిన సమస్యను సకాలంలో అధికారులు పరిష్కరించాలి. ఏం చర్యలు చేపట్టారో అధికారులు క్షేత్రస్థాయిలో ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఫిర్యాదు పరిష్కారంలో పురోగతిని తెలుసుకునేందుకు వీలుంటుంది. అధికారి స్పందించకపోతే పైస్థాయి అధికారికి చేరుతుంది. అక్కడ్నుంచి అపరిష్కృత జాబితాలో పడుతుంది. సంబంధిత అధికారిని బాధ్యుడిని చేసి పరిష్కారం చూపే వరకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ యాప్ వినియోగంతో పుర ప్రజలకు అందిస్తున్న సేవల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.