మూడు రోజుల పండగకు ముస్తాబు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో

అరసవల్లి కూడలి వద్ద ఏర్పాటు చేసిన సూర్యనారాయణ స్వామి విద్యుద్దీపాల కటౌట్‌

రథసప్తమి వేడుకలకు శ్రీకారం

నేటి నుంచి సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు

ఉచితంగా వీక్షించేందుకు ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాట్లు

ఆకర్షణగా నిలవనున్న హెలీకాప్టర్‌ టూరిజం, లేజర్‌ షో

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పండగగా మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. మూడు రోజుల పండగకు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడా కార్యక్రమాలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిరోజు ఆదివారం ఉదయం ఆరు గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిసారిగా హెలీకాప్టర్‌ టూరిజంను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డచ్‌ బిల్డింగ్‌, కలెక్టరేట్‌ వద్ద హెలీకాప్టర్‌ రైడ్‌ ఉంటుంది. గ్రామీణ క్రీడా పోటీలు ఉదయం పది గంటలకు ఎన్‌.టి.ఆర్‌ మున్సిపల్‌ మైదానంలో ప్రారంభమవుతాయి. వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, కర్రసాము, సంగిడీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్‌, పిల్లిమొగ్గలు వంటి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు.శోభాయాత్రశోభాయాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి అరసవల్లి ప్రధాన ఆలయం వరకు నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోహి స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌, దుంపల ఈశ్వర్‌, యామినీ కృష్ణ, పరిమళ, అనురాధ, లక్ష్మీగణపతి శర్మ బృందాలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. హైపర్‌ ఆది, ఫైమా, ఢ భూమిక, రేలారే రేలా టీమ్‌, మిమిక్రీ ఆనంద్‌, జోష్‌ శివ, పిన్నీ సాంగ్‌ ఫేమ్‌ షణ్ముఖ, సురేష్‌ రేష్మ, బాలాజీ వంటి ప్రముఖులు ధూంధాం కార్యక్రమంలో పాల్గొంటారు.ప్రత్యేక ఆకర్షణ కానున్న లేజర్‌ షోరాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఆహూతులను అలరించేలా లేజర్‌ షో ఏర్పాటు చేశారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీ అంజనా కళా సంస్థ ఆధ్వర్యాన పేరొందిన నటీనటులతో పంచరత్నాలు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు. మయసభ పడక సీను, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, గయోపాఖ్యానం, శ్రీ సత్యహరిశ్చంద్ర వారణాశి నుంచి ప్రారంభం వంటి నాటకాలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.కోడి రామ్మూర్తి స్టేడియంలో పార్కింగ్‌ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోనే ఫుడ్‌ కోర్టులు అందుబాటులో ఉంచారు. ప్రముఖ, స్థానిక హోటళ్లతో కలిపి అందుబాటు ధరలోనే ఆహార పదార్థాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో పార్కింగ్‌, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు.3న.. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెలీకాప్టరు రైడ్‌. మున్సిపల్‌ మైదానంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల ముగింపు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు. సుందరంపల్లి శ్రీనివాస్‌ శాక్సోఫోన్‌, సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యాన గిరిజన నృత్యం, బుర్రకథ, మావుడూరు సత్యనారాయణ శాస్త్రీయ సంగీతం, నీరజా సుబ్రమణ్యం, రఘుపాత్రుని శ్రీకాంత్‌ బృందాల శాస్త్రీయ నృత్యం, సంప్రదాయ గురుకులం యోగా నృత్యం, 7 గంటలకు లేజర్‌ షో, 8.15 నుంచి మంగ్లీ టీమ్‌ సినీ సంగీత విభావరి, రాత్రి 9.30 గంటలకు క్రాకర్స్‌ షో… రాత్రి 1గంటకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో క్షీరాభిషేకం మొదలు.4న… అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మహాక్షీరాభిషేక సేవ, పట్టువస్త్రాల సమర్పణ, ఉదయం 8 గంటల నుంచి నిజరూప సందర్శన, సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణాలంకరణ సేవ, రాత్రి పవళింపు సేవతో ఉత్సవాల ముగింపు వేడుకలు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డచ్‌ బిల్డింగ్‌ వద్ద హెలీకాప్టర్‌ రైడ్‌.ఆకాశంలో విహారం హెలీకాప్టర్‌ రైడ్‌కు రూ.1800 ఈనెల రెండు నుంచి నాలుగో తేదీ వరకు డచ్‌ భవనం ప్రాంగణంలో హెలీకాప్టర్‌ విహారానికి ప్రతి ట్రిప్పుకు ఐదు నిమిషాలు, ఒక్కొక్కరికి టికెట్‌ రూ.1800గా నిర్ణయించారు. రెండేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం లేదు. టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ లో పొందడం తెలియని వారి కోసం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ని ఏర్పాటు చేశారు. టిక్కెట్‌ కేవలం ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా మాత్రమే చేసుకోవాలి. టిక్కెట్ల బుకింగ్‌ కోసం ష్ట్రవశ్రీఱతీఱసవ.aతీaఝఙaశ్రీశ్రీఱరబఅస్త్రశీస.శీతీస్త్ర వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.రథసప్తమి ఏర్పాట్లు పరిశీలనరథసప్తమి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం పరిశీలించారు. సూర్య నమస్కారాలు నిర్వహించే 80 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఎస్‌పి సిహెచ్‌.వివేకానందతో చర్చించి పలు సూచనలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న బ్యూటిఫికేషన్‌ పనులను పరిశీలించారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్‌ ఏర్పాట్లను పరిశీలించారు. సిట్టింగ్‌ ఏర్పాట్లపై జెసి, ఆర్‌డిఒ కె.సాయి ప్రత్యూషతో చర్చించి పలు సూచనలు చేశారు.పటిష్ట బందోబస్తురథసప్తమి వేడుకలకు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. రథసప్తమి వేడుకల భద్రత, బందోబస్తు ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఆలయం లోపల క్యూలైన్లలో ఒకే సమయంలో ఎక్కువ మంది రద్దీ లేకుండా అవసరమైన బారికేడ్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలు పార్కింగ్‌ నిమిత్తం నిర్దేశించిన ఎల్‌.ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌, అరసవల్లి ఎంపియుపి పాఠశాల, వాడాడ జంక్షన్‌, 80 అడుగుల రహదారి మార్గంలో ఎపిహెచ్‌బి కాలనీ వద్ద గల పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించి వాహనాలు రాకపోకలకు, పార్కింగ్‌కు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్‌పి సిహెచ్‌.వివేకానంద, సిఐలు, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.

 

➡️