ప్రజాశక్తి – సరుబుజ్జిలి
జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతి ప్రవేశాలకు జనవరి 18వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ డి.పరశురామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు సెప్టెంబరు 16వ తేదీ లోపు ష్ట్ర్్జూర://అaఙశీసaya.స్త్రశీఙ.ఱఅ/అఙర/వఅ/నశీఎవ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలని తెలిపారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు (వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి), మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2013 నుంచి జూలై 31, 2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ ప్రవేశ పరీక్ష కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, అరిథ్మెటిక్, లాంగ్వేజ్) మొత్తం 80 ప్రశ్నలు వంద మార్కులకు రెండు గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.