మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై

ఆందోళన వ్యక్తం చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు

నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, సిఐటియు టౌన్‌ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు మున్సిపాల్టీలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన, అకాల మరణం పొందిన, అనారోగ్యం పాలైన పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ స్థానంలో సామాజిక భద్రతలో భాగంగా వారి పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘ కాలం పాటు నగర ప్రజలకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వారికి జీవన భృతి కోసం గ్రాట్యుటీ చెల్లించి ఆదుకోవాలన్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు జిఒ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు నష్టదాయకమైన లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించపోతే భవిష్యత్‌లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 20న నిర్వహించే అఖిల భారత సమ్మెలో మున్సిపల్‌ కార్మికులు భాగస్వామ్యమవుతున్నట్లు తెలిపారు. ధర్నా అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసాదరావుకు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు ఎ.గణేష్‌, కె.రాజు, డి.యుగంధర్‌, ఎ.శేఖర్‌, డి.గంగ, ఎన్‌.జె లక్ష్మి, కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం మస్టర్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు ఎ.రమేష్‌ కుమార్‌ పట్నాయక్‌, మంగళ్‌ సత్తు, గంగాధర్‌ రౌతో, ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️