పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

జిల్లాలో పెండింగ్‌

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న రైతు, కౌలురైతుసంఘం నాయకులు, రైతులు 

  • రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు
  • కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

జిల్లాలో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ రైతు, కౌలురైతుసంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మూడింట రెండొంతుల వ్యవసాయం వర్షాధారమని, అదునుకు వర్షాలు పడక… వ్యవసాయం ముందుకు సాగక జిల్లా ప్రజలకు వలసబాట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సహజసిద్ధమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రాలేదన్నారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా వంటి జీవ నదులు, మరెన్నో ఊటగెడ్డలు, వాగుల్లో లభిస్తున్న నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు భూములకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరం చెరువు ఆక్రమణలు తొలగించి మినీ రిజర్వాయరుగా చేయాలన్నారు. బుడుమూరు నారాయణ సాగరాన్ని మినీ రిజర్వాయరుగా చేయాలని డిమాండ్‌ చేశారు. మందస చేపిగెడ్డ నీటిని గోపాలసాగరానికి మళ్లించాలన్నారు. తండ్యాం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, పైడిగాం ప్రాజెక్టును ఆధునీకరించాలని కోరారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు మరమ్మతులకు గురై నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయని, కాలువలో మట్టిపెల్లలు పడి, గుర్రపుడెక్కలు పెరిగి నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా ఉందన్నారు. నారాయణపురం వంటి పురాతన ప్రాజెక్టులూ రైతులకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుడి, ఎడమ కాలువలు పూడిక పేరుకుపోయి చివరి భూములకు నీరందడం లేదన్నారు. రైతులు ఎన్ని పర్యాయాలు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు తగినన్ని నిధులు కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 సంవత్సర బడ్జెట్‌లో రూ.18,020 కోట్లు కేటాయించినా, అందులో శ్రీకాకుళం జిల్లాకు నామమాత్రపు కేటాయింపులే మిగిలాయన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు కనీసంగా రూ.రెండు వేల కోట్లు అయినా ఇచ్చి ఈ ఏడాది కొన్ని ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా మొత్తం నీరందించడానికి ఇరిగేషన్‌ నిపుణులు చెప్పిన ప్రకారంగా రూ.పది వేల కోట్లు దశల వారీగా కేటాయించాలన్నారు. జిల్లాలోని నీటి వనరులను ఉపయోగించుకుని జిల్లాలో శాశ్వతంగా కరువు నివారించే అవకాశం ఉందన్నారు. జిల్లాకు అవసరమైన నిధులు విడుదల చేసి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు పి.చందర్రావు, కె.కొండయ్య, బి.వాసు, ఎం.అజరు, ముద్దాడ రమణ, రుప్ప ఆదినారాయణ, జె.కృష్ణారావు, అల్లు.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️