మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్
ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఖరీఫ్ నాటికి రైతులకు సాగునీటి ఇబ్బందుల్లేకుండా కాలువలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని రెగ్యులర్, ఆర్ఎంసి, బైరిదేశి గెడ్డకు సంబంధించిన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఖరీఫ్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పట్నుంచే చిన్న కాలువలను ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టాలన్నారు. చెక్డ్యామ్లు, ఇతర నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులను ఉపాధి నిధులతో చేపట్టి పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ నిధులు మంజూరైన వెంటనే మెయిన్ కెనాల్ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, సాగునీటి సంఘాల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.