మాట్లాడుతున్న తాండ్ర ప్రకాష్
జిల్లా కార్మిక, రైతు సంఘాల నాయకులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం
లేబర్ కోడ్లు రద్దు, తదితర డిమాండ్తో ఈనెల 20న నిర్వహించనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని జిల్లాలోని కార్మిక, రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి. శనివారం నగరంలోని క్రాంతి భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల, ట్రేడ్ యూనియన్ల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ పంటల మద్దతు ధరల చట్టం తీసుకురావాలన్నారు. రైతుల రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలన్నారు. రైతులకు పెట్టబడి సాయంగా రూ.20 వేలు తక్షణమే చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబరు కోడ్లు రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలు వల్ల కార్మికవర్గ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. వెట్టిచాకిరీ, బానిస విధానాన్ని కార్మికుల నెత్తిన రుద్దే చర్యలు సరికాదన్నారు. కార్మికవర్గం ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందన్నారు. దేశవ్యాప్త సమ్మెతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటును తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ ద్వారా రెండు వందల రోజుల పని దినాలతో పాటు, రోజువారి కూలీ రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించి సెకీ, యాక్సిస్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. నూతన మార్కెట్ పాలసీని రద్దు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల వృత్తిదారుల హక్కులు కాపాడాలన్నారు. ధాన్యం, జీడిపంట, కొక్, శనగ, మినుములు తదితర పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే రైతు ఉత్పత్తులను కోనుగోలు చేయలన్నారు. కార్మికులు తమ పోరాటాల సాధించిన హక్కలు, చట్టాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని, కార్మికవర్గం తమ శక్తిని ఈ సమ్మె ద్వారా చాటాలని కోరారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ ప్రయోజనాల అనుకూల చట్టాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సమ్మె పురస్కరించుకొని గ్రామ, మండల, డివిజన్ కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ తాండ్ర. ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రరావు, కె.మోహనరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ఐఎఫ్టియు జిల్లా నాయకులు కృష్ణవేణి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.సంతోష్ పాల్గొన్నారు.