అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంతో నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు
ప్రజాశక్తి-శ్రీకాకుళం
ఏలూరులోని సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం జర్నలిస్టు, ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక డే అండ్ నైట్ కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవ హారం చేపట్టారు. పత్రిక స్వేచ్ఛపై దాడిని ఖండించాలి, ఎమ్మెల్యే చింతమనేనిని బర్తరఫ్ చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర నాయకులు కొంక్యాన వేణుగోపాల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జోగి నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి పి తేజేశ్వరరావు తదితరులు మాట్లాడారు. మీడియాపై దాడులను ప్రజా స్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టుటౌన్ సిఐ ఈశ్వరరావు పలు డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో దళిత జెఎసి జిల్లా కన్వీనర్ కంఠ వేణు, జిల్లా గ్రంథాలయ శాఖ కన్వీనర్ బి సూర్యారావు, సాక్షి బ్యూరో చీఫ్ కె శివశంకర్, ఎడిషన్ ఇంఛార్జి కడారి రాజా, సాక్షి టివి బ్యూరో సునీల్, నాయకులు జి వి నాగభూషణం, బివిఎస్ నాయుడు, శ్రీనివాసరావు, బాలు, బగాది అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.