మాట్లాడుతున్న అప్పలరాజు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, అమరావతి పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుచరగణంతో కలిసి రూ.వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారని మాజీ మంత్రి, వైసిపి నాయకులు సీదిరి అప్పలరాజు ఆరోపించారు. నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని విమర్శించారు. మరోవైపు అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేశారని, అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం వల్ల సమ్మిళితమైన అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీకి తెరలేపారని, దీనిపై మేధావులు నోరు మెదపకపోతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి 34 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు అదనంగా మళ్లీ భూసమీకరణకు తెరలేపారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు జిల్లాకు ఇప్పటివరకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చని జీడి, కొబ్బరి తోటలను తొలగించి ఎయిర్పోర్టు కడతామంటున్నారని, దీనిపై ప్రజలు ప్రశ్నిస్తే జెండాలు పట్టుకుని వచ్చేస్తున్నారని మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేతోనైనా చర్చించకుండా, ప్రజలకు చెప్పకుండా ఎయిర్పోర్టు కట్టేస్తామని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా, వారి జీవనాన్ని శాశ్వతంగా దెబ్బతీసే చర్యలు సరికాదన్నారు. ఇతర నిబంధనలతో ముడిపెట్టకుండా వేట సాగించే మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మత్స్యకారులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.