ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి

వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ, ఉద్యోగుల

వినతిపత్రం అందజేస్తున్న శ్రీరామ్మూర్తి

ప్రజాశక్తి – శ్రీకాకుళం

వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పించేందుకు తక్షణమే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి డిమాండ్‌ చేశారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారిని శుక్రవారం కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియతో పాటు స్పష్టమైన జిఒలు లేకుండా సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం ఉపాధ్యాయులకు ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సమస్యలను గుర్తింపు సంఘాల సమావేశాల్లో ఉన్నతస్థాయి అధికారులకు వివరించినా పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. జిఒ 117 రద్దు చేసి కొత్త జిఒ ఆధారంగా ప్రాథమిక పాఠశాలలో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలన్నారు. మోడల్‌ స్కూల్‌లో ఐదు తరగతులు బోధించడానికి వీలుగా ఐదుగురు ఉపాద్యాయులను తప్పక నియమించాలన్నారు. ఉర్దూ, ఒరియా మైనర్‌ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదని ఆ పోస్టులు అదనంగా ఇవ్వాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను కేటాయించడంతో పాటు ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలన్నారు. వీటితో పాటు గందరగోళానికి దారితీస్తున్న పలు అంశాలపై అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా కార్యదర్శి జి.సురేష్‌, అన్నాజీ, స్వర్ణకుమారి, జి.శ్రీరామచంద్రమూర్తి, ఎల్‌.కోదండరామయ్య, టి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️