ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు మరీ ముఖ్యంగా టిడిపి నాయకులకు మేలు చేసేలా ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకువెళ్తోంది. ఇకపై రాజకీయ పాలన సాగిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లుగానే నేతలకు పదవుల భరోసా దక్కుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల కంటే ముందుగానే నేతలకు ప్రయోజనం చేకూర్చే పనులపై నిర్ణయాలను తీసుకుంటుండటం చూస్తున్నాం. ఏటా జనవరిలో జాబ్ కేలండర్ ప్రకటించి ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ యువతకు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ కేలండర్ హామిని అటకెక్కించి ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేలండర్ను అమలు చేయడం చూస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం ఐదారు విడతలుగా నియామకాలు జరిపింది. ఆ తర్వాత జిల్లాలో సైతం ఖాళీగా ఉన్న డిసిసిబి చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను భర్తీ చేసింది. నిరుద్యోగ యువతకు భరోసా నిచ్చే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడలేదు. కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఒక జనవరి గడచిపోయింది. యువనేత లోకేష్ పదేపదే చెప్పిన జాబ్ కేలండర్ మాత్రం వెలువడలేదు. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికే అన్నట్లు ప్రస్తుతం దానిని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జిల్లాలో ఇటీవల నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కోటబొమ్మాళి, శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేటలో జాబ్మేళాలు నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా పోస్టర్లను ఆవిష్కరించి అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునివ్వడంతో నిరుద్యోగుల నుంచి మంచి స్పందన కనిపించింది. ప్రభుత్వపరంగా దాదాపు పదేళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఏదో ఒక ప్రయివేట్ ఉద్యోగంలో చేరి సెటిలవుదామని ఆశగా వచ్చిన యువతకు నిరాశే మిగిలింది. నెలకు రూ.15 వేలు ఇస్తాం, నెల్లూరులో పని చేస్తారా అన్ని కంపెనీలు అడగటంతో నిరుద్యోగులు బిక్కమొఖం వేశారు. రూ.15 వేలు జీతంతో ఏం బతుకుతా మంటూ ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. దీంతో జాబ్ మేళాల లక్ష్యం పెద్దగా నెరవేరలేదన్న ట్లుగా చర్చనడుస్తోంది. నాలుగు చోట్ల నిర్వహించిన జాబ్మేళాలకు 5 వేల మందికి పైగా హాజరయితే అందులో 1450 మంది ఎంపికయ్యారు. వారిలో ఉద్యోగాల్లో చేరింది మాత్రం వెయ్యి మంది ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో జాబ్మేళాల నిర్వహణ కొత్తేమి కాదు. గతంలో జిల్లా ఉపాధి కార్యాలయం, స్కిల్ డవలప్మెంట్ డిపార్టుమెంట్లు చాలాసార్లు ఇటువంటి మేళాలు ఎన్నో నిర్వహించాయి. నియోజవర్గ కేంద్రాల్లో నిర్వహణ, ఎమ్మెల్యేలతో పోస్టర్ల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలతో కొత్తగా ఏదో చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడానికే ఈ బిల్డప్ అంతా అని నిరుద్యోగుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన దాదాపు పదకొండు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశమివ్వడంతో అర్హులైన పేదలకు కొంతమేర ఉపశమనం కలిగించినట్లయింది. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. కొత్త కార్డుల కోసం సచివాలయాలకు వెళ్తున్న దరఖాస్తుదారులకు నిరాశే మిగులుతోంది. కొత్త కార్డులు పొందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలతో దరఖాస్తు చేసే అవకాశం లేకుండాపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆదాయం పొందుతున్న వారిని అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. దీంతో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు తదితర చిరుద్యోగులు కొత్త కార్డులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరలతో నెలకు రూ.10 వేలు, రూ.15 వేలు ఆదాయం వస్తే ఒక కుటుంబం ఎలా బతకగలదు? ప్రభుత్వం వేతనాలు పెంచదు సరి కదా? ఇటువంటి సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయడం విచారకరం. కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు అనర్హులని తెలిపింది. విద్యుత్ వినియోగం 300 దాటిన కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వబోమని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటితో పాటు ఐదు ఎకరాల మెట్టు, మూడు ఎకరాల పల్లం భూమి కలిగి ఉన్నా వారినీ అనర్హులని చేసింది. కొత్త కార్డుల జారీకి గత వైసిపి ప్రభుత్వం ఏ నిబంధనలయితే రూపొందించిందో వాటినే కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేయడం గమనార్హం. వైసిపి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను తిరగదోడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పేదలకు ఉపయోగపడే అంశాల విషయంలో మాత్రం సమీక్షించడానికి ఇష్టపడినట్లు లేదు. వీలైనంత ఎక్కువ మందికి రేషన్ కార్డులు ఇస్తే సబ్సిడీ భారం భరించాల్సి వస్తుందని ప్రభుత్వం బహుశా భావించినట్లుగా కనిపిస్తోంది. జగన్ నొక్కే బటన్లన్నీ తాము అందించే పింఛన్లతో సమానమంటూ ఒకవైపు బహిరంగ సభల్లో చెప్తూ అమలు దగ్గకొచ్చే సరికి సంక్షేమ పథకాలకు పెడుతున్న కోతతో ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరి బయటపడుతోంది. తన జీవితం పేదలకే అంకితమంటూ పదే పదే చెప్తున్న చంద్రబాబు పేదలకు ఇచ్చే పథకాలను రకరకాల ఆంక్షల పేరుతో వారికి దూరం చేయడం ఇదేం రకం అంకితమో మరి!