సమావేశంలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి – టెక్కలి రూరల్
ఈనెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రతి మంగళ, బుధవారాలు వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి సాగుకు సంబంధించిన విషయాలను వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జిఎపి), భూసార పరిరక్షణ, భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల వాడకం, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పారదర్శకంగా రైతులకు సేవలు అందించాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతుల సమస్యలకు సూచనలు అందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ఎడి బి.వి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.