విద్యార్థినులతో మాట్లాడుతున్న కాంతారావు
- మెనూను సక్రమంగా అమలు చేయాలి
- రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండియు) వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గుడివీధిలోని డిసిఎంఎస్ పౌరసరఫరాల దుకాణాన్ని అక్కడున్న ఎండియు వాహనంలో సరఫరా అవుతున్న సరుకులను పరిశీలించారు. అరసవల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి ప్రతిరోజూ అందజేస్తున్న ఆహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఎస్ఒ సూర్యప్రకాశరావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఐసిడిఎస్ సిడిపిఒ శోభారాణి, డిప్యూటీ డిఎంహెచ్ఒ, ఫుడ్ ఇన్స్పెక్టర్, తూనికలు కొలతల శాఖ, సిఎస్డిటి చక్రవర్తి, ఎండియూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.