మాట్లాడుతున్న సిఐ ఈశ్వరరావు
- నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
నగరంలో పలుచోట్ల నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన వాకాడ సూర్యనారాయణ, వాకాడ గణేష్ను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సిఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ సంతోష్ తెలిపారు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. నగరంలోని మెడికవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీకి గురైన నాలుగు బైక్లను గుర్తించినట్లు తెలిపారు. నిందితులు పల్సర్ బైక్పై ప్రయాణిస్తూ పట్టుబడ్డారని, వారిని విచారించగా వారు నడుపుతున్న వాహనం విశాఖ నగరంలో దొంగిలించినట్టు అంగీకరించారని వివరించారు. ఆ బైక్తో పాటు నగరంలోని మరో రెండు బైక్లతో పాటు రణస్థలంలో చోరీకి గురైన మరో బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు గతంలోనూ పలు చోరీలకు పాల్పడిన పాత నేరస్తులుగా గుర్తించామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.