యుపిఎస్‌ వద్దే వద్దుఏకీకృత పెన్షన్‌ రద్దు చేయాలి

కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌

శ్రీకాకుళం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి

యుటిఎఫ్‌ నాయకుల డిమాండ్‌

తాలూకా కేంద్రాల వద్ద ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యుపిఎస్‌) ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర స్పష్టం చేశారు. యుపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, ఉద్యోగులు శుక్రవారం తాలూకా కేంద్రాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో వారు మాట్లాడారు. 2004 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేస్తున్నాయని చెప్పారు. పోరాటాల ద్వారా సాధించుకున్న పాత పెన్షన్‌ ఉద్యోగుల హక్కు అని, భిక్ష కాదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖాతరు చేయకుండా సిపిఎస్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని 20 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరాటాల ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం సిపిఎస్‌ స్థానంలో గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ తెచ్చి సిపిఎస్‌ కంటే మెరుగైందని నమ్మబలికిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ విధానాన్ని తిరస్కరించారని, మరోరూపంగా ఉన్న యుపిఎస్‌ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. యుపిఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని కేంద్రం సూచన చేసిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు లాభం లేని కార్పొరేట్ల షేర్‌ మార్కెట్‌ మాత్రమే లాభాన్ని చేకూర్చే యుపిఎస్‌ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్‌ లేని పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తూ యుపిఎస్‌ వంటి అంకెల గారడీ చేసే పెన్షన్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. ధర్నా అనంతరం తహశీల్దార్‌ గణపతిరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడ్నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు ఉపాద్యాయ, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు కరుకోల సురేష్‌ కుమార్‌, పి.చిన్నారావు, వైకుంఠరావు, తాతారావు, డి.సంధ్యారాణి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.టెక్కలి : మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. యుపిఎస్‌ని రద్దు చేయాలని నినాదాలు చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు కురమాన దాలయ్య, పాలవలస ధర్మారావు, పి.గణపతి, టి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.కోటబొమ్మాళి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం ఉప తహశీల్దార్‌ ఆర్‌.మధుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ సిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ గొండు నారాయణరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, మండల ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సింహాచలం, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.పాతపట్నం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి మజ్జి వెంకటరమణ, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడ్డ మోహనరావు, జి.కవీశ్వరరావు, ఎం.శంకరరావు, ఎం.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.సోంపేట : యుపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ అధ్యక్షులు లండ బాబురావు, రాష్ట్ర కౌన్సిలర్‌ గుంట కోదండరావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దొరబాబు, కూర్మారావు, కంచిలి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళి నాయక్‌, రవికుమార్‌, మందస మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జగదీష్‌ బాదిత్య, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.పొందూరు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం తహశీల్దార్‌ ఎన్‌.రమేష్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ స్టేట్‌ కౌన్సిలర్‌ పొందూరు అప్పారావు, మండల అధ్యక్షులు గురుగుబెల్లి గోపాలరావు, జి.మధుబాబు, మురళి, సత్యనారాయణ, మెట్ట భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.కొత్తూరు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ వై.అనంత్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.శ్రీను, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.శోభన్‌బాబు, కె.విజరు కుమార్‌, నాయకులు దండు ప్రకాశరావు, బి.స్వర్ణలత, టి.గణపతి, టి.రవి, బి.గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️