ర్యాలీనుద్దేశించి మాట్లాడుతున్న శైలేష్కుమార్
* కార్మికశాఖ సహాయ అధికారి వై.శైలేష్ కుమార్
శ్రీకాకుళం అర్బన్: జిల్లాను వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కార్మిక శాఖ సహాయ అధికారి వై.శైలేష్ కుమార్ అన్నారు. నగరంలోని ఎన్జిఒ హోం వద్ద కార్మిక చట్టాలపై కార్మికులకు అవగాహనా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను నిర్బంధించి పనిచేయించడం చట్టరీత్యా నేరమన్నారు. పని ప్రదేశాల్లో కార్మికులపై నిర్బంధ విధానాలను అమలు చేస్తే, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత పని గంటల తర్వాత కార్మికులు స్వేచ్ఛగా తమకు నచ్చిన చోట జీవించే హక్కు ఉందన్నారు. యజమాన్యానికి డబ్బులు బకాయిలు ఉన్నాయన్న కారణంతో నిర్బంధించి పని చేయించడం నేరమన్నారు. కార్యక్రమంలో ఎఎల్ఒ-2 ఆర్.వి శ్రీనివాసరావు, లైన్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, ఎఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు చిక్కాల గోవిందరావు, నేచర్ ఎన్జిఒ ప్రతినిధులు శేఖర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.