సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పి చైర్పర్సన్ విజయ
- అంచనా వ్యయం రూ.1462.20 కోట్లు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జిల్లాపరిషత్కు గతేడాది వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, పలు అనుబంధ శాఖలకు అందజేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసుకుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జెడ్పి చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జెడ్పి సిఇఒ శ్రీధర్ రాజా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రాబడి అంచనా అనుసరించి జిల్లాపరిషత్ సహా పిఐయు, పంచాయతీరాజ్, పిఆర్ఐ శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లు, ఆర్డబ్ల్యుఎస్ విభాగాలకు సంబంధించి రూపొందించిన ఈ బడ్జెట్లో రూ.1580,59,07,806 ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అందులో కార్యాలయాల నిర్వహణ, ఇతర అభివృద్ధి ఖర్చులు రూ.1462,20,29,241 వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ అంచనాలను అనుసరించి ఈ ఏడాది మిగులు రూ.118,38,78,565 ఉంటుందని అందులో పేర్కొన్నారు. శాఖల వారీగా చూస్తే జిల్లా పరిషత్ పరిధిలో 2025-26 సంవత్సరానికి గానూ ఆదాయం రూ.41,92,69,300 కాగా, వ్యయం రూ. 41,74,96,100 ఉంటుందని, అందులో మిగులు రూ.17,73,200 ఉంటుందని అంచనా వేశారు. శ్రీకాకుళం పంచాయతీరాజ్ పి.ఐ.యు డివిజన్ పరిధిలో 2025-26 సంవత్సరానికి ఆదాయం అంచనా రూ.424,31,35,000 కాగా, వ్యయం రూ 383,04,16,500, మిగులు రూ.41,27,18,500గా చూపించారు. పంచాయతీరాజ్ పిఆర్ఐ శ్రీకాకుళం డివిజన్లో 2025-26 వార్షిక ఆదాయం రూ.112,49,15,616 కాగా, వ్యయం రూ.112,40,65,616, మిగులు రూ.8,50,000 ఉంటుందని అంచనా రూపొందించారు. పంచాయతీరాజ్ టెక్కలి డివిజన్లో 2025-26 సంవత్సరానికి ఆదాయం రూ.47,47,12,633 కాగా, వ్యయం రూ.45,11,86,490, మిగులు రూ.2,35,26,143 ఉంటుందని అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలోని పాలకొండ పిఆర్ఐ డివిజన్లో 2025-26 వార్షిక ఆదాయం రూ. 211,59,48,047 కాగా, వ్యయం రూ.207,80,70,000, మిగులు రూ.3,78,78,047 ఉంటుందని అంచనా పొందుపరిచారు. ఆర్డబ్ల్యుఎస్ శ్రీకాకుళం డివిజన్లో 2025-26 సంవత్సరానికి ఆదాయం రూ.742,79,27,210, వ్యయం రూ.672,07,94,535, మిగులు రూ.70,71,32,675 ఉంటుందని అంచనా వేశారు. సమావేశంలో జెడ్పి వైస్ చైర్పర్సన్ పి.శ్రావణి, జెడ్పి డిప్యూటీ సిఇఒ డి.సత్యనారాయణ, పి.ఐ.యు డివిజన్, పి.అర్.ఐ, పంచాయతీరాజ్ శ్రీకాకుళం కార్యనిర్వాహక ఇంజినీరు ఎస్.రామకృష్ణ, పలు శాఖల అధికారులు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఒకటో స్థాయీ సంఘం సమావేశం జెడ్పి చైర్పర్సన్ విజయ అధ్యక్షతన నిర్వహించారు.