ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, భక్తులు పాల్గొన్నారు.రేపు చక్రస్నానం : శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు సోమవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.15న పుష్పయాగం : శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 10వ రోజు మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
