ప్రజాశక్తి – ఆలమూరు : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల గ్రామపంచాయతీకి రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరిలకు సంబంధించి పలు పంచాయతీలకు ఈ అవార్డులను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అమరావతిలో గురువారం అందించారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి విభాగంలో పినపళ్లకు ఈ అవార్డు దక్కింది. పంచాయతీరాజ్ రూరల్, డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ కుమార్ , పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్షతేజ ల చేతుల మీదుగా సర్పంచ్ సుభాష్ తో పాటు గ్రామ కార్యదర్శి షణ్ముఖ వీర్రాజు ఈ అవార్డును అందుకున్నారు. 2021 లో ప్రతిష్టాత్మంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి సుభాష్ సర్పంచ్గా గెలుపొందారు. అప్పటి నుంచి పినపళ్ల గ్రామాభివృద్ధికి విశేష కృషిచేస్తూ వస్తున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. యువకుడైన సుభాష్ తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో పాలకులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ గ్రామాభివృద్ధికి తగిన నిధులు రాబట్ట గలుగుతున్నారు. గత రెండు ఏళ్లుగా ఈ గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించి పలు సర్వే బృందాలు ఆ గ్రామం వచ్చి పరిశీలించాయి. చివరకు అభివృద్ధితో పాటు ఆ గ్రామ పరిధిలో గల ఓఎన్జిసి, ఫ్యాక్టరీ ద్వారా జీవనోపాధి అవకాశాలు మెరుగు పడడంతో ఆ విభాగం నుంచి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడానికి సహకరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావుకు, ఆలమూరు ఎంపీడీవో, ఇన్చార్జి డిఎల్పిఓ ఎ.రాజుకు, ఇతర అధికారులకు, ఓఎన్జిసి, ఫ్యాక్టరీ యాజమాన్యానికి, గ్రామస్తులకు సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు.
