మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి గోపాలకృష్ణ
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వెట్టిచాకిరీ నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయసేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి, మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి గోపాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కార్మికుల్ని బలవంతంగా పనిచేయించుకోవటం నేరమని అన్నారు. వెట్టిచాకిరీ చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇవ్వటం కూడా నేరమేనని అన్నారు. పెద్దవారితోపాటు పిల్లలను కూడా వెట్టిచాకిరీ చేయించటం నేరమని తెలిపారు. ఈ నేరానికి ఫైన్తోపాటు మూడేళ్లపాటు శిక్షలు ఉన్నాయని చెప్పారు. వెట్టిచాకిరీ నిరోధించటానికి జిల్లా రెస్క్యూ టీమ్ అప్రమత్తంగా ఉండి, వెట్టిచాకిరీని నిర్మూలనకు కృషి చేయాలన్నారు. రెస్య్కూ చేయబడిన కార్మికులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం గురించి విరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఒ కె.శ్రీనివాసరావు, ఎసిఎల్ సుబాని, మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పి సుబ్బారావు, ప్యానల్ న్యావాది కట్టా కాళిదాసు, ఇతర ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, పోలీసు అధికారులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
