సమ్మె ఒప్పంద జీవోలు ఇవ్వాలి

Jan 10,2025 20:56

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : గతంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద జీవోలను ఇవ్వాలని, కార్మికులను 62ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగించాలని సంక్రాంతి కానుక, హెల్త్‌ ఆలవెన్స్‌, సరెండర్‌ లీవ్‌ డబ్బులు, డిఎ , జీతాలు బకాయి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు ఎ.జగన్మోహన్‌ మాట్లాడుతూ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, మట్టి ఖర్చులు, ఎక్స్రేషియా పెంపు తదితర రాతపూర్వక హామీలకు తక్షణమే జీవోలు ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్‌ అయిన 12 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలివ్వాలని, జీవో నెంబర్‌ 12 ప్రకారం ఇంజినీరింగ్‌ మరియు నాన్‌ పిహెచ్‌ కార్మికులందరికీ సంక్రాంతి కానుక 1000 రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జనవరి 6న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్‌ 2ను సవరించి కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌, థర్డ్‌ పార్టీ ఎన్‌ఎంఆర్‌ కార్మికులందరినీ (ఎంటిఎస్‌) మినిమం టైమ్‌ స్కేల్‌ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో యూనియన్‌ నాయకులు బి.భాస్కరరావు, బి.రాఘవ, బి.చిన్ని, తిరుమలరావు, కృష్ణ, పైడిరాజు కార్మికులు పాల్గొన్నారు.

➡️