ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటు విద్యా సంస్థలకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ స్థాయి ఫలితాల అబ్బురపరిచారు. గత మార్చి నెలలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మార్కా పురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి 254 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకాగా అందులో 222 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఉత్తీర్ణత 87 శాతంగా రికార్డు సృష్టించింది. ఆ పాఠశాలకు చెందిన చెప్పల్లి శ్రీహర్ష సాయి 600/582 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. కోట్ల వెంకటశివారెడ్డి 568 మార్కులతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. షేక్ ఖాసింవలి 564 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. విశేషం ఏమిటంటే ఆ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 49 మంది 500లకు పైగా మార్కులు సాధించడమే! పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన శ్రీహర్షసాయితో పాటు ఆయన తండ్రి చెప్పల్లి నారాయణను ఆ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు మునగాల చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యాయులు బుధవారం ఘనంగా సత్కరించారు. మార్కాపురం పట్టణంలోని జడ్పి బాలికల ఉన్నత పాఠశాలలోనూ పదిలో ఫలితాల హవా కొనసాగింది. ఆ పాఠశాలకు చెందిన వైవిటి చంద్రిక 590 మార్కులతో డివిజన్ స్థాయిలో ర్యాంకు సాధించింది. మొత్తం 278 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 251 మంది ఉత్తీర్ణత సాధించారు. 550 మార్కులకు పైగా 31 మంది, 500 మార్కులకు పైగా 93 మంది ఉత్తీర్ణులు కావడం గమనార్హం. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి శ్రీదేవి, ఇతర ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లిలోగల ఎపి మోడల్ స్కూల్లో పదో తరగతి ఫలితాల్లో బొప్పరాజు సాత్విక 591 మార్కులతో రికార్డు సృష్టించింది.
