ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ భూమి కబ్జా శీర్షికన శుక్రవారం ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్తకు నగర పాలక సంస్థ అధికారులు స్పందించారు. కమిషనర్ నల్లనయ్య ఆదేశాలు మేరకు టౌన్ ప్లానింగ్ ఎసిపి ఐవి రమణమూర్తి ఆధ్వర్యంలో టిపిఒ అప్పలరాజు, టౌన్ సర్వేయర్ సింహాచలం కెఎల్ పురం సర్వే నెంబర్ 165లో ఉన్న భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమి ఎంత ఉందో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఎసిపి రమణమూర్తి మాట్లాడుతూ సర్వే చేసిన తర్వాత కమీషనర్ ఆదేశాలు ప్రకారం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ భూమిలో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. సర్వేలో మండల రెవెన్యూ అధికారి,సచివాలయ సిబ్బంది, వార్డు కార్పొరేటర్ తాళ్లపూడి సంతోషి పాల్గొన్నారు.