మూఢ నమ్మకాలతో ముగ్గురు బలి

  • చిన్నారిని చంపిన తల్లి, అమ్మమ్మ
  • బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకుమార్తెలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌ : మూఢనమ్మకాలతో మనవరాలిని చంపి.. అనంతరం పోలీసులకు పట్టుబడతామనే భయంతో నేల బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంలో నివసిస్తున్న సావిత్రి (56) కుమార్తె వరలక్ష్మి (30)కి విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన కర్రి శ్రీనివాసరావుకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పూర్ణ చంద్రిక (13) కుమార్తె ఉంది. చంద్రిక 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో డెంకాడ చర్చిలో పాస్టర్‌తో సావిత్రి పలు ప్రార్థనలు చేయించారు. అయినా పూర్ణచంద్రిక ఆరోగ్యం కుదుట పడలేదు. అక్కడ నుంచి విశాఖపట్నం సిటీ జ్ఞానాపురంలోని చర్చికి తీసుకెళ్లి ప్రార్ధనలు చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. అనంతరం చర్చి ఫాదర్లు మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లికి, అమ్మమ్మకి చెప్పారు. అయినా వాళ్లు మొండిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శనివారం చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా చంద్రిక ఏడవడంతో తల్లి, అమ్మమ్మ చిన్న పాప అని చూడకుండా ఆ చిన్నారి నోటిలో గుడ్డలు కుక్కారు. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందింది. చంద్రికను తల్లి, అమ్మమ్మ చంపేశారని మృతురాలి తండ్రి డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిరువులపైన కేసు నమోదు చేసి గాలిస్తుండగా విషయం తెలుసుకున్న సావిత్రి, వరలక్ష్మి అక్కడ నుంచి పారిపోయి శ్రీకాకుళం జిల్లా గూడెం చేరుకున్నారు. వారికి ఏం చేయాలో అర్థం కాక తల్లీకూతుర్లు ఇద్దరూ మెడలకు చున్ని కట్టుకొని గ్రామ సమీపంలో ఉన్న నేలబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను దూరం నుంచి చూసిన స్థానికులు పరుగున వెళ్లి నూతిలోకి దిగి వారిని బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరా శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజనాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️