పాలస్తీనా ప్రజలకు అండగా ఉందాం : వక్తల పిలుపు

Jan 16,2025 16:43 #book, #Kurnool, #palasteena

ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్ : పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా చూడకూడదని ప్రపంచంలో జరుగుతున్న సామ్రాజ్యవాదానికి ప్రతిబింబంగా చూడాలని, ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దారుణ మారణకాండకు వ్యతిరేకంగా మేధావులు కవులు కళాకారులు గళం విప్పాలని పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని బావర్చి ఫంక్షన్ హాల్లో కవి చౌసా రచించిన ‘బిసాన్ ఓవ్ డా ‘ పుస్తకాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణులు డాక్టర్ మన్సూర్ రెహమాన్ ఆవిష్కరించారు. నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా సభ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పుస్తకాన్ని కథా రచయిత ఇనాయతుల్లా సమీక్షించారు. సభలో సమీక్షకులు మాట్లాడుతూ ఒక చిన్న దేశంపై సామ్రాజ్యవాద దేశాలన్నీ కలసి యుద్ధం చేస్తూ పసి పిల్లల్ని మహిళల్ని చంపుతూ ఆ దేశాన్ని నెత్తుటి మయం చేశాయని దీన్ని చౌసా గొప్ప కవిత్వంగా రాశారని అన్నారు. బిసాన్ ఓవ్ డా పాలస్తీనాలో జర్నలిస్ట్ గా పని చేస్తూ యుద్ధాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె అందించడం మూలంగా ఆ దేశంలో జరుగుతున్న స్థితిగతులన్నీ మనకు తెలుస్తున్నాయని అన్నారు. ఆ నేలను నెత్తుటితో తడుపుతున్నారనే విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయన్నారు. ఆవిష్కర్త మాట్లాడుతూ ఈ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న సామ్రాజ్యవాద కాంక్ష చాలా ప్రమాదమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా సామ్యవాదాన్ని కోరుకుంటూ కవి చౌసా రచనలు సాగిస్తున్నారని అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మనదేశంలో కూడా మతోన్మాదులు పెట్రేగిపోతున్నారని పాలస్తీనాన్ని ధ్వంసం చేసినట్లే మన దేశాన్ని ధ్వంసం చేసే కుట్రలు పన్నుతున్నారని, మతోన్మాదం బలమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నారని లౌకిక సమాజాన్ని అందరం కలిసి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. మాట్లాడుతూ ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ కవి చౌసా ఇప్పటివరకు తన రాసిన రచనలన్నీ వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలే వస్తువులుగా రాశారని అన్నారు. ఆవాజ్ నాయకులు ఇక్బాల్ మాట్లాడుతూ ఈ దేశాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మతోన్మాద శక్తుల ఆటలు సాగవని, అలాగే పాలస్తీనా ప్రజలకు అందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. మహాప్రస్థానం మరో ప్రస్థానం సమూహం నిర్వహణలో కొనసాగించారు. సభను కవి కెంగార మోహన్ ప్రారంభించగా సభలో ప్రతులను ఇవ్వాల్సిన కోడుమూరు ఆవాజ్ నాయకులు ముస్తఫా, యూసుఫ్ లు అందుకున్నారు. సభలో కవులు కళ్యాణదుర్గం స్వర్ణలత, సయ్యద్ జహీర్ అహ్మద్, రామాంజనేయులు, విజయులు తనగల, గౌ రెడ్డి హరిచంద్ర రెడ్డి, ఆద్య మెడికల్స్ అధినేత ఏవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️