ప్రజాశక్తి -బాపట్ల : సహచట్ట ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ పి. శామ్యూల్ జోనాథన్ పిలుప ునిచ్చారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ద్వి దశాబ్ధి ఉత్సవాలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి.సాయిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ సహ చట్టం నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. జిల్లా అధికారులు ప్రతి నెలా మూడో శుక్రవారాన్ని ‘సహ చట్ట దినోత్సవం’ గా పాటిస్తూ సహచట్ట అమలును పర్యవేక్షించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో వెబ్ పోర్టల్ ద్వారా సహ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపడుతుందన్నారు. ప్రజలతో ముడిపడి ఉన్న విధానపరమైన అంశాల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టం దీనికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం శామ్యూల్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవిత సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రచురించిన వారోత్సవ కరపత్రాలను కమిషనర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిడిపిఒ లక్ష్మీపార్వతి, శ్రీనివాస్, మౌనిక, నాయకులు యువి. రామారావు, ఫోరం సభ్యులు జివి, మానం అప్పారావు, కరణం రవీంద్ర, మానవత సభ్యులు ప్రసన్న, వంకాయలపాటి హరిబాబు, వాసుదేవరావు, కేశవులు, బొలగానివెంకటేశ్వర్లు, మోహన్ కుమార్, న్యాయవాది జమ్రుద్ బాషా, గుదే రాజారావు పాల్గొన్నారు.
