పార్కులు పరిరక్షణ అందరి బాధ్యత

Apr 24,2025 17:42 #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : పార్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కే. అప్పలరాజు అన్నారు. గురువారం స్థానిక 28వ డివిజన్ పి.ఎస్.ఆర్ కాలనీ పార్క్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేటర్ జాకీర్ హుస్సేన్ పలు సమస్యలను వినతి రూపంలో ఆయనకు అందజేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చొరవ చూపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కే. అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 28వ డివిజన్లో పర్యటించి పలు సమస్యలు గుర్తించామన్నారు. ముఖ్యంగా పార్కుల నిర్వహణ విషయమై ఇబ్బందులను గమనించామన్నారు. వాటిని పరిష్కరించేందుకు తగు సూచనలు చేస్తామన్నారు. అలాగే కాలువల ప్రక్షాళన గూర్చి పలువురు ప్రస్తావించడం జరిగిందన్నారు. సమస్యలన్నింటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి అవి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. అలాగే కొన్ని పనులు టెండర్ దశలోనూ, మరికొన్ని పనులు నిర్మాణ దశలోనూ ఉన్నాయని తెలిపారు. సత్వరమే అన్ని పనులు పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు దృష్టిలోకి తీసుకు వెళ్ళామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో సీతారామమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️