అండర్‌ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : తిరుపతి రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.12.23 కోట్లతో పట్టణంలోని ప్రధాన ప్రాంతాలయిన హీరో హోండా షోరూం వద్ద ఎల్‌.సి-107, రైల్వే సి.ఆర్‌.ఎస్‌ వద్ద ఉన్న ఎల్‌.సి-109 అండర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి అంగీకారం తెలుపుతూ అప్పట్లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధానపరమైన అనుమతులు పూర్తి కావడంతో ఎట్టకేలకు పనులు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి సోమవారం పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూడాలని రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రైల్వే లైన్‌ కి ఇరువైపులా పట్టణం విస్తరించి ఉండటంతో రైల్వే గేట్ల సమీపంలో వాహన చోదకుల ట్రాఫిక్‌ కష్టాలు వర్ణనాతీతమనీ ఆయన అన్నారు. అండర్‌ బ్రిడ్జిల నిర్మాణంతో తిరుపతి ట్రాఫిక్‌ సమస్యలకు త్వరలో పరిష్కారం లబిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️